గంజాయి, మత్తుమందులను అడ్డుకుని నెల్లూరులో ప్రజలకు అండగా నిలిచిన కె పెంచలయ్యను చంపినవారిని, వారికి అండదండలిచ్చి ప్రోత్సహించిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఆయన కుటుంబాన్ని పరామర్శించి వారికి అన్ని విధాలా పునరావాస చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి అనితను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు హోంమంత్రికి ఆదివారం లేఖ రాశారు. నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య తన కళారూపాలతో, చైతన్యపరుస్తూ గంజాయి, మత్తుమందులతో కుటుంబాలు నాశనం కారాదని పట్టుదలతో పోలీసులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి గంజాయి అంతం చేయాలని చురుకుగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో గంజాయి ముఠా కక్షగట్టి ఆయనను వెంటాడి, వేటాడి అత్యంత దారుణంగా, క్రూరంగా, కన్నబిడ్డల ముందే కత్తులతో నరికి చంపడం రాష్ట్రంలో తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.

హంతకులు కత్తులు, రాడ్లు, మారణాయుధాలతో స్వైరవిహారం చేసి, బైక్పై వెళ్తున్న అతడిని తరిమి తరిమి చంపడం వెనుక గంజాయి మాఫియా ఉందనేది స్పష్టమని తెలిపారు. కొంతకాలంగా గంజాయి ముఠాను నడుపుతూ వారితో చోరీలు, నేరాలు, గంజాయి, మత్తుమందుల అమ్మకాలు చేయిస్తున్న ఒక మహిళ కారణమని పోలీసులు ఇప్పటికే ప్రకటించారని, ఆమెను తక్షణం అరెస్టు చేయాలని, ఎవరు అధికారంలో ఉంటే వారి అండదండలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు మీరు పదే పదే ప్రకటిస్తూ వచ్చారని, కానీ గంజాయి ముఠా చేసిన ఈ హత్యపై హోంమంత్రిగా కనీసం స్పందించలేదని వివరించారు. మాటమాత్రంగానూ ఖండించలేదని, ఇలా అయితే గంజాయిపై పోరాడే వారికి మీరు ఎలా భరోసా ఇవ్వగలరని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆ గంజాయి మాఫియాకు బలైన యువకుడి కుటుంబాన్ని సందర్శించి, భరోసా కల్పించాలని కోరారు.
పెంచలయ్య భార్య దుర్గకు రూ.50 లక్షల సాయం, ఆరు ఎకరాల భూమి, ఉద్యోగం ఇవ్వాలి
పెంచలయ్యది అత్యంత నిరుపేద దళిత కుటుంబమని, పెంచలయ్య భార్యతో పాటు ఇద్దరు చదువుకుంటున్న పిల్లలున్నారని వివరించారు. ఆ కుటుంబానికి కనీసం రూ.50 లక్షల సహాయం, ఆరు ఎకరాల భూమి, ఒక ఇల్లు శాంక్షన్ చేయాలని కోరారు. ఆయన భార్య దుర్గకు ఉద్యోగం కల్పించాలని, ఇద్దరు పిల్లల చదువుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు మీ నుండి ప్రకటన వస్తుందని, ఇప్పటికైనా వెంటనే ఆ కుటుంబాన్ని సందర్శించి వారికి భరోసా కల్పిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడో, ఇక్కడో గంజాయి నేరస్తులను పట్టుకుంటున్నప్పటికీ కీలక సూత్రధారులు యథాతథంగా ఉన్న ఫలితమే ఈ హత్యని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, మద్యం, మత్తు పదార్థాల అక్రమ అమ్మకాల మాఫియాను అరికట్టేందుకు మరింత స్పష్టమైన, సమగ్రమైన చర్యలు చేపట్టాలని ఈ దారుణ ఘటన హెచ్చరిస్తుందని వివరించారు. ఈ మాఫియా ముఠాలు రాష్ట్రంలో ఎక్కడున్నా అధికార యంత్రాంగంతో అంటకాగి రక్షణ పొందుతున్నారని, ఇలాంటి శక్తులను ప్రోత్సహించేవారు ఏ పార్టీలో ఉన్నా, అధికార యంత్రాంగంలో ఏ స్థానంలో ఉన్నా అలాంటి శక్తులపట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్, మాఫియాను అరికట్టేందుకు త్రికరణశుద్ధితో తగిన చర్యలు చేపట్టాలని, వాటిపై పోరాడే ప్రజలకు బాసటగా ప్రభుత్వం నిలబడాలని కోరారు.
Recent Post:-
జంఝావతి సాధనకై గ్రామ సమితులు…!
టీవీ యాంకర్ శివజ్యోతి తిరుమలలోకి నో ఎంట్రీ – టీటీడీ కఠిన నిర్ణయం










Leave a Reply