మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవితో కలిసి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని సూచించారు. ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, నామినేషన్ స్వీకరణ కేంద్రాల ఏర్పాటు, రిటర్నింగ్ మరియు సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ, నోడల్ మరియు జోనల్ అధికారుల నియామకం, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టిక్ సర్వైలెన్స్ బృందాలు, పి.ఓ, ఓ.పి.ఓలకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్, సామాగ్రి పంపిణీ కేంద్రాలు, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లలో తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు ఎన్నికల బడ్జెట్ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి – కలెక్టర్ కె. హరిత, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ ఆర్డిఓ లోకేశ్వర్ రావుతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి – కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 28 పోలింగ్ కేంద్రాలు, కాగజ్నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు 85 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, వెబ్కాస్టింగ్, అధికారుల నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్లు గజానన్, రాజేందర్, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.











Leave a Reply